తెలుగు భాషకు వెలుగు పూలు పూయించిన తొలి తెలుగు శాసనం. 'కలమళ్ళ శాసనం' రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన తొలి తెలుగు శాసనం
కడప జిల్లాలోని కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనాన్ని 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు గుర్తించారు. నేటికి లభించిన తొలి తెలుగు శాసనాల్లో కలమళ్ళ శాసనమే ప్రప్రథమ మనడానికి అందులో వాడిన ప్రాచీన లిపి-భాషలే ప్రమాణం.
పోగొట్టుకున్నాం!
ఈసారి పోయింది అట్లాటి ఇట్లాటి వస్తువు కాదు. తెలుగు భాషకు వెలుగు పూలు పూయించిన తొలి తెలుగు శాసనం...
తెలుగు భాషకు రాజ భాష హోదాను, శాసన భాషగా ఒక అధికార ప్రతిపత్తి కల్గించి, తెలుగు భాషకు అక్షర రూపం యిచ్చి చారిత్రకంగా, సాహిత్యపరంగా ఘన వారసత్వ కీర్తిని అందించిన 'కలమళ్ళ శాసనం' -తొలి తెలుగు శాసనం ఎక్కడుందో యిప్పుడెవరికీ తెలియడం లేదు. అందరూ నిస్సహాయంగా చేతులెత్తేస్తున్నారు. దీంతో దాదాపుగా మనం తొలి తెలుగు శాసనాన్ని కోల్పోయినట్లేనని భావించాల్సి వస్తోంది. కడప జిల్లాలోని కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనాన్ని 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు గుర్తించారు. ఆ తర్వాత వారితో పాటూ ఆ శాసనాన్ని మద్రాసు మ్యూజియానికి తరలించారని అందరూ భావిస్తూ వచ్చారు. ఇదే నేపథ్యంలో నేను సమాచార హక్కు చట్టం ద్వారా 07 జనవరి 2013 నాడు శాసనం నమూనా ప్రతిని, స్క్రిప్ట్ను జతపర్చుతూ సమగ్ర వివరాలతో చెన్నై 'ఎగ్మోర్' ప్రభుత్వ మ్యూజియం వారిని ప్రశ్నించడం జరిగింది.
తొలి తెలుగు శాసనం, రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనంకు సంబంధించిన వివరాలు, మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారా? దానిని తగిన విధంగా సంరక్షిస్తున్నారా? వంటి ప్రశ్నలను వారి ముందుంచినప్పుడు- అలాంటి శాసనమేదీ తమ వద్ద లేదని- చెన్నై ప్రభుత్వ మ్యూజియం అసిస్టెంట్ డైరక్టర్ తిరు ఎస్. సెల్వ అరసు, అధికారికంగా లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
దీంతో యింతకాలంగా ఎగ్మో ర్ మ్యూజియంలో వుందని భ్రమపడుతూ వచ్చిన శాసనం అక్కడ లేదని తేలిపోయింది. అంతకు మునుపే శాసన నిర్దేశకుల కార్యాలయం, భారతీయ పురాతత్వశాఖ, మైసూరు వారి వద్ద కూడా ఈ శాసనం లేదని వెల్లడైంది. ఈ మైసూర్ శాఖ ఎపిగ్రాఫియా ఇండియా, ఏన్యువల్ రిపోర్ట్ ఆన్ ఇండియన్ ఎపిగ్రఫీ అనే శాసన పత్రికలను కూడా ప్రచురిస్తోంది. ఈ మైసూర్ కార్యాలయానికి 125 సంవత్సరాల చరిత్ర కూడా వుంది. వీరి వద్ద రేనాటి చోళుల శాసనాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం వుంది. కానీ 'తొలి తెలుగు శాసనాన్ని' సేకరించకపోయినందుకు, సంరక్షించక పోయినందుకు మనం విచారించాల్సిందే!
ఇదే విధంగా భారతీయ పురాతత్వ సర్వేక్షణ, ఉప పురాతత్వ అధీక్షకులు- హైదరాబాదు వారిని కూడా 30 అక్టోబర్ 2012 నాడు రెండు లేఖల ద్వారా ప్రశ్నించడం జరిగింది. వారి నుంచి కూడా అసంతృప్తిని మిగిల్చే సమాధానాలే లభించాయి. తొలి తెలుగు శాసనం ఆచూకీ తమకు కూడా తెలియదని చేతులెత్తేయడం దిగ్భ్రాంతిని కల్గిస్తోంది.
సమాచార హక్కు చట్టం ద్వారా భారతీయ పురాతత్వ శాఖ, హైద్రా బాదు మండలం వారిని ఈ అంశంపై అడిగిన కొన్ని ప్రశ్నలు- వాటికి వారిచ్చిన సమాధానాలు ఇవి:
- కడప జిల్లాలో బయల్పడిన 'కలమళ్ళ శాసనం' ప్రస్తుతం ఎక్కడ వుంది?
- కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో 1904లో మద్రాసు నందలి శాసన పరిశోధన విభాగం వారు ఈ శాసనాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఎక్కడ వుందో తెలియదు. ?
- కలమళ్ళ శాసనం పొడవు, వెడల్పు, ఆకారం, బరువు వంటి సాంకేతిక వివరాలు తెలపగలరు?
- కలమళ్ళ శాసనం పొడవు, వెడల్పు, ఆకారం, బరువు వంటి సాంకేతిక వివరాలు లభించుట లేదు.
- కలమళ్ళ శాసనాన్ని మొదటిసారిగా ఎవరు, ఎప్పు డు, ఎక్కడ గుర్తించారు? తర్వాత ఎక్కడికి తరలించారు? ప్రస్తుతం ఎక్క డుంది?
- కలమళ్ళ శాసనాన్ని తొలిసారిగా 1904లో మద్రాసు ప్రభుత్వ శాఖ వారు కలమళ్ళ గ్రామంలోని ఆలయ ప్రాంగణంలో వున్న ట్లు గుర్తించారు. తర్వాత 1947-48 లో ఆచార్య కె.నీలకంఠ శాస్త్రి, యమ్. వెంకట రామయ్య ఈ శాసనాన్ని పరిష్కరించి ప్రచురించారు.
ఇంతకు మించి ఏ సమాచారం అందుబాటులో లేదు.
- తొలి తెలుగు శాసనంగా చెప్పబడుతున్న కడప జిల్లా లోని కలమళ్ళ శాసనంను భారతీయ పురాతత్వ శాఖ తొలి తెలుగు శాసనంగా అంగీకరిస్తోందా? అంగీకరిస్తే ఆధారాలు తెలుపగలరు?
రేనాటి చోళరాజు ధనుంజయుడు వేయించిన కలమళ్ళ శిలాశాసనాన్ని తొలి తెలుగు శాసనంగా ప్రసిద్ధ శాసన పరిశోధకులు సహేతుకంగా నిర్ణయించారు. కావున మేము కూడా వారి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాము. నేటికి లభించిన తొలి తెలుగు శాసనాల్లో కలమళ్ళ శాసనమే ప్రప్రథమ మనడానికి అందులో వాడిన ప్రాచీన లిపి-భాషలే ప్రమాణం. ఎరికల్ ముత్తురాజు వేయించిన ఎర్రగుడిపాడు శాసనం, పుణ్యకుమారుడి తిప్పలూరు శాసనాలు తర్వాత క్రమంలో వచ్చి చేరుతాయి.
Read 8536 times | |
Published in History/చరిత్ర |